Home >>> బిజినెస్ > యూట్యూబ్ సీఈఓగా మన భారతీయుడు
యూట్యూబ్కి కొత్త సీఈఓగా మన భారతీయుడు నియమితుడయ్యాడు. ప్రస్తుతం య్యూటూబ్కు సీఈఓగా ఉన్న సుసాన్ వోజ్కికీ యూట్యూబ్ సీఈఓ పదవి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో.. నీల్ మోహన్ బాధ్యతలు స్వీకరిస్తారని యూట్యూబ్ తెలిపింది. మోహన్ కొత్త SVP మరియు యూట్యూబ్కి సీఈఓగా వ్యవహరిస్తారు. 2015 నుండి, మోహన్ యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా
పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ వీడియో వేదికగా గుర్తింపు పొందిన యూట్యూబ్ను ఇకపై భారతీయుడు నడిపించనున్నారు. ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయులు కీలక పదవులను అధిరోహిస్తుండటం విశేషం. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ ఉన్నారు. తాజాగా, నీల్ మోహన్ మరోసారి భారత్ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పారు. మరో భారతీయుడు పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే.. కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్మోహన్కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు.
సుసాన్ వోజ్కి సేవలపై ప్రశంసలు కురిపించిన ఆయన.. అసాధారణ టీమ్ను సిద్ధం చేశారన్నారు. యూట్యూబ్ను నీల్ మోహన్ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించాలని సుందర్ పిచాయ్ ఆకాంక్షించారు. కాగా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన నీల్ మోహన్.. 2008లో గూగుల్లో చేరారు. సీఈవో పదవి నుంచి వైదొలిగిన సుసాన్ వోజ్కికీ యూట్యూబ్తో ఎంతో అనుబంధం ఉంది. మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్లో 25ఏళ్లుగా పలు పదవుల్లో కొనసాగారు. యూట్యూబ్కు గత తొమ్మిది ఏళ్లుగా సీఈవోగా ఉన్నారు. బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు సూసన్ లేఖ రాశారు. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ప్రాజెక్ట్లపై దృష్టి సారించేందుకు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్రయాణం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నానని ఆమె వివరించారు.