Home >>> పాలిటిక్స్ > తెలుగు వాడి ఆత్మగౌరవమే అన్నగారి నినాదం
నటుడిగా ఉన్నప్పుడే వరద బాధితుల కోసం జోలె పట్టుకుని ఊరూరా తిరిగిన అన్నగారు.. అధికారంలోకి వచ్చాక తెలుగు వాడి శ్రేయస్సే ధ్యేయంగా పాలన సాగించారు. అడ్మినిస్ట్రేషన్లో అంతర్లీనంగా అన్నగారు పాటించే సూత్రం ప్రజోపయోగం ఒక్కటే. ఎంత ప్రజారంజకంగా పాలించారో... తనదైన రాజసంతో రాజకీయాలూ నడిపారు. తెలుగోడి సత్తాను దేశమంతా తెలిసేలా చేశారు. రాజకీయంగా తనపై జరిగిన కుట్రలను ప్రజా బలంతోనే తిప్పికొట్టారు. సమాజానికి ఏదో చేయాలన్న తపన... ఆయన్ను మహానేతగా తయారు చేయడమే కాదు.. కోట్లాది మంది గుండెల్లో కొలువుండేలా చేసింది.
సమాజమే నా దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటను.. తాను అధికారంలో ఉన్న చివరి క్షణం వరకూ త్రికరణ శుద్ధిగా పాటించిన ఒకే ఒక నాయకుడు ఎన్టీఆర్. ఆయనకు ప్రజా సంక్షేమం తప్ప... కుటిల రాజకీయాలు తెలియవు. తెలుగు ప్రజలందరినీ తన కుటుంబంగా భావించారు. వాళ్లకు చేయాల్సిన మేళ్లు తప్ప.. స్వార్థం అన్న మాట ఆయన జీవితంలో ఏనాడూ కానరాలేదు.
రాజకీయాల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, నిష్పాక్షికత ఆయన్ను చూసే నేర్చుకోవాలి. చాలా మంది సోకాల్డ్ నాయకులు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి... మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలా అని పనిచేస్తారు. ఎన్టీఆర్ మాత్రం గెలిచినప్పటి నుంచి జనక్షేమమనే తపనతోనే అడుగులేశారు. ప్రజాక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్లేవారు. ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకునేవారు. తెలుగు వాడి ఆత్మగౌరవం విషయంలో రవ్వంత కూడా రాజీపడని నాయకుడు ఆయనొక్కడే... తన పదవి పోతుందన్న పరిస్థితులు వచ్చినా... ఏనాడూ తలవంచింది లేదు. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనలే తప్ప.. పదవీ కాంక్ష ఆయనకు ఏనాడూ లేదు.
దేశ రాజకీయాల్లో అపజయం ఎరుగని ఇందిరాగాంధీకి తెలుగుదేశం ఆవిర్భావంతో పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఆ పరాజయంతో ఎన్టీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు చక్రం తిప్పిన ఇందిర... అప్పటి గవర్నర్ రాంలాల్ సాయంతో నాదెండ్ల భాస్కరరావు సీఎం అయ్యేలా పావులు కదిపిందన్న విమర్శలు బలంగా వినిపించాయి. ఇలా అనుయాయులే వెన్నుపోటు పోడిచినా... ఎన్టీఆర్ మరోసారి ప్రజల్లోకి వెళ్లి.. తన పీఠం దక్కించుకున్నారు. ఇది ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు ప్రత్యక్ష నిదర్శనం.
1984లో ఇందిరాగాంధీ దారుణ హత్య జరిగిన మరుసటి ఏడాది కేంద్రంలో లోక్సభ రద్దైంది. ఆనాడు పంజాబ్ మినహా... 514 స్థానాల్లో జరిగిన ఎనిమిదో లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 404 సీట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ 30 స్థానాలు దక్కించుకుని, లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. ఇందిరాగాంధీ మరణంతో దేశమంతా బలమైన సానుభూతి పవనాలు వీచినా... ఏపీలో మాత్రం అన్నగారి హవాయే నడిచింది. దేశ లోక్సభ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా గెలవడం అదే తొలిసారి.. అలా తెలుగోడి సత్తా ఏంటో ఐదేళ్ల పాటు ఢిల్లీకి కాంగ్రెస్కు రుచి చూపించారు ఎన్టీఆర్.
ఇక పాలనలో ఏ మాత్రం పొరపాటు జరిగినా సహించేవారు కాదు ఎన్టీఆర్. 1989 ఫిబ్రవరి 8న ఈనాడులో రూ.227 కోట్ల లోటుతో రాష్ట్ర బడ్జెట్ అంటూ ఓ పత్రికలో వార్త ప్రచురితమైంది. అత్యంత రహస్యంగా ఉండాల్సిన స్టేట్ బడ్జెట్ ఇలా పత్రికలకు లీకవ్వడం సహించలేకపోయిన అన్నగారు... క్షణమాలోచించకుండా స్టేట్ క్యాబినెట్ రద్దు చేసి ఫిబ్రవరి 15న కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేశారు. అలా ఆనాడు అన్నగారు తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్త సంచలనమైంది.
వారసత్వ రాజకీయాలకు నిలయమైన కాంగ్రెస్కు వ్యతిరేకంగా.. దేశంలో ప్రతిపక్షాలను, వామపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా అడుగులేసి, జాతీయ శక్తిగా ఎదిగారు. విజయవాడలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించారు. కృష్ణా నదీ తీరంలో జనం మధ్యన ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహించారు. ఆ సమావేశానికి వచ్చిన వాజ్పేయికి బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెప్పించి ఆయనే స్వయంగా వడ్డించడాన్ని ఆ తరం వారు ఇప్పటికీ విశేషంగా చెప్పుకుంటారు.
మారుతున్న కాలంతో పాటు అవకాశవాద రాజకీయాలకు ప్రతి ఒక్కరూ తలొగ్గాల్సి వస్తోంది. కానీ అన్నగారు జనం, మనం అన్న మాట వస్తే.. ముందుగా జనానికే ఓటేసేవారు. పరిపాలన విషయంలో ఆయన మాటంటే మాటే... ఉరుము ఉరిమి మీద పడినా.. వెనక్కి తగ్గేవారు కాదు. ఆత్మ గౌరవం విషయంలో రాజీ లేదు. దేన్నైనా శాసించి తీసుకోవడమే తప్ప.. బతిమాలడం అనే మాట ఆయన డిక్షనరీలో కనిపించదు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని కేంద్ర పీఠం ముందు సగర్వంగా నిలబెట్టిన శక్తి ఎన్టీఆర్. ప్రజల మధ్యే పుట్టి, ప్రజలతోనే జీవించి, ప్రజల కోసమే జీవించి, ఆఖరికి ఆ ప్రజల మధ్యే కన్నుమూసిన మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగోడు అన్న మాటకు కేరాఫ్ అడ్రస్... సామాన్యుడి గుండెల్లో కొలువైన మన ఎన్టీవోడు.. అందుకే తెలుగు అన్న మూడక్షరాలున్నంత కాలం.. ఎన్టీఆర్ అన్న పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది... యుగపురుషుడు మరి..
అందుకే ఇప్పటికీ... ఎప్పటికీ.... రాముడైనా నువ్వే... కృష్ణుడైనా నువ్వే.... తెలుగు వారి గుండెల్లో గుడి కట్టుకున్న దైవానివీ నువ్వే... నటుడివి నువ్వే... నాయకుడివి నువ్వే... పేదల కోసం జోలె పట్టావు... అన్నార్తుల కడుపు నింపావు... తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన ఎన్టీవోడివి నువ్వే... తెలుగుజాతి గుండెల్లో నీ రూపం పదిలం... తెలుగు వాడి మదిలో నీ పేరు అజరామరం... శక పురుషునికి శత వసంతాల నీరాజనం.... అక్షర సుమాంజలి.