Home >>> పాలిటిక్స్ > ఆ శాఖ అంటే అమ్మ బాబోయ్ అంటున్న నేతలు...!
రాజకీయాల్లో సెంటిమెంట్లది పెద్ద పాత్ర. నామినేషన్ వేయాలన్నా... ప్రచారం మొదలు పెట్టాలన్నా... చివరికి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వెళ్లాలన్నా సరే.. ముహుర్తం చూసుకోకుండా.. అడుగు బయటపెట్టరు రాజకీయ పార్టీల నేతలు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టే పదవులపై కూడా నేతలు తీసుకునే నిర్ణయాలు ఆసక్తి రేపుతాయి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభాపతి స్థానం అంటే నేతలకు హడల్. నిజమే... స్పీకర్ పదవి చేపట్టిన నేత ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిందే లేదు. ఈ రికార్డును ఇటీవల తెలంగాణ మాజీ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బ్రేక్ చేశారు. అయితే ఆయన గెలిచినప్పటికీ... పార్టీ ఓడిపోవడంతో ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు పోచారం. ఇక ఏపీలో అయితే... స్పీకర్ పదవి చేపట్టిన ప్రస్తుత శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఓటమి ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. దీంతో.. స్పీకర్ కుర్చీలో ఎవరు కూర్చుంటారని సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది.
అలాగే మరో కీలక శాఖ విషయంలో కూడా ఏపీ నేతలు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన తర్వాత.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే... అప్పటికే సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న దేవినేని ఉమామహేశ్వరరావు ఏపీలోని నీటి ప్రాజెక్టులపై స్పష్టమైన అవగాహనతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు కూడా. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే... జల వనరుల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. దాదాపు అందరు మంత్రుల శాఖలు మారినప్పటికీ... దేవినేని ఉమాను మాత్రం చంద్రబాబు మార్చలేదు. అయితే ఉప ఎన్నికల మొదలు... వరుసగా మూడుసార్లు గెలిచిన దేవినేని ఉమ... 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు. అయినా సరే... ప్రస్తుత ఎన్నికల్లో దేవినేని ఉమాకు టికెట్ రాలేదు.
ఇదే పరిస్థితి వైసీపీ నేతలది కూడా. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జలవనరుల శాఖను తొలిసారి నిర్వహించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అసెంబ్లీలో గొప్పగా ప్రకటించారు. అయితే... మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనిల్ మంత్రి పదవి పోయింది. ఆయన స్థానంలో అంబటి రాంబాబుకు అవకాశం దక్కింది. కనీస అవగాహన కూడా లేని అంబటి గోదావరి నది మీద పులిచింతల ప్రాజెక్టు ఉందని నోరు జారేశారు. ఆ తర్వాత కూడా పోలవరం సహా ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై నాకేం తెలుసు అంటూ తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు కూడా ఓడిపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ను ఎమ్మెల్యేకు బదులుగా ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్. కనీస అవగాహన కూడా లేని నరసరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేయడం వల్ల అనిల్ను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇక మంత్రి అంబటి రాంబాబును అయితే... మసాజ్ మంత్రి అని పేరు పెట్టేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రోడ్డు మీద డాన్స్ వేయడంతో సంబరాల రాంబాబు అని పేరు కూడా పెట్టేశారు. ఈయనకు ఓటు వేసేది లేదని సొంత పార్టీ నేతలే గతంలో చెప్పేశారు. రాంబాబు ఓటమి ఖాయమని కూడా తేల్చేశారు. దీంతో జలవనరుల శాఖ నిర్వహించిన మంత్రులు తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమనే సెంటిమెంట్ ప్రస్తుతం ఏపీ నేతల్లో హాట్ టాపిక్గా మారింది.