కేజ్రీవాల్ టార్గెట్ అదేనా...?

Home >>> పాలిటిక్స్ > కేజ్రీవాల్ టార్గెట్ అదేనా...?

news-details

ఆమ్ ఆద్మీ పార్టీ... దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం. ఓ సామాన్య వ్యక్తి... పార్టీ స్థాపించి... చివరికి దేశ రాజకీయాల్లోనే కీలకమైన వ్యక్తిగా మారారు. ఢిల్లీలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ఆప్. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్న ప్రధాన ప్రతిపక్షాల్లో ఆప్ ఒకటి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆప్ విస్తరిస్తోంది. 2013లో తొలిసారి ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆప్... ఆ తర్వాత 2015, 2020 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఘన విజయం సాధించి... బీజేపీకి షాక్ ఇచ్చిన పార్టీ ఆప్. ఇక పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆప్... కాంగ్రెస్, బీజేపీలను వెనక్కి నెట్టి అధికారం చేపట్టింది. ఇప్పుడు అదే ఊపులో మరో రాష్ట్రంపై దృష్టి పెట్టారు కేజ్రీవాల్.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... దాదాపు మూడు నెలలుగా జైలులోనే ఉన్నారు. తాను ఏ తప్పు చేయలేదని... బీజేపీకి మద్దతు ఇస్తే... తనపై ఉన్న కేసులన్నీ ఎత్తేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని తేల్చేశారు కేజ్రీవాల్. మోదీ సర్కార్‌పై ఒంటి కాలితో దూసుకెళ్లే కేజ్రీవాల్... తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. అయితే పంజాబ్, ఢిల్లీ సరిహద్దు రాష్ట్రం కావడంతో... రెండు రాష్ట్రాల్లో కూడా ఆప్ అధికారంలో ఉంది. దీంతో హర్యానాలో ఆప్ గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టు కూడా సానుభూతిగా మారుతుందనేది ఆప్ నేతలు భావిస్తున్నారు. అందుకే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు హర్యానా అసెంబ్లీకి సమయం ఉంది. అయితే ప్రస్తుత బీజేపీ సర్కార్‌పై అవినీతి ఆరోపణలున్నాయి. అందుకే ఈ ఏడాది మార్చి 12వ తేదీనే అక్కడ ముఖ్యమంత్రిని బీజేపీ పెద్దలు మార్చేశారు. ఇది కూడా ఆప్‌కు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన ఆందోళనకు ఆప్ సంపూర్ణ మద్దతు తెలిపింది. అందుకే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. అదే ధీమాతో హర్యానాలో కూడా పోటీకి సై అంటున్నారు ఆప్ నేతలు.

You can share this post!