Home >>> క్రైమ్ > తిరుమలలో బాలుడిపై చిరుత దాడి
తిరుమల-అలిపిరి నడకదారిలో ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుత....అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పోయింది. గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో స్థానికులు, భక్తులు, భద్రత సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం మేరకు... కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్(4)తో కలిసి కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరారు.
వీరు మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో కూర్చుని ఆహారం తీసుకుంటుండగా... బాలుడు పక్కనే ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఆకస్మాత్తుగా వచ్చిన చిరుత పులి చిన్నారి తలను నోట కరచుకొని అడవిలోకి తీసుకుపోయింది. అక్కడే ఉన్న దుకాణదారుడు, బాలుడి తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ పులివెనక పరుగులు తీశారు. టార్చ్ లైట్లు వేస్తూ రాళ్లు విసురుతూ కేకలు వేయడంతో భయాందోళనకు గురైన చిరుత... పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. అక్కడ ఉన్న పోలీసులు తీవ్రంగా గాయపడిన బాలుడికి ప్రథమ చికిత్స అందించారు.