Home >>> పాలిటిక్స్ > ఇద్దరూ ఇద్దరే... రారు.. కానీ...!
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్. అదేమిటంటే... ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి వస్తారా... రారా... వస్తే ఏం మాట్లాడుతారు.. రాకపోతే ఎందుకు రావడం లేదు... కొత్తగా ఏ సాకు చెబుతారు... ఇదే విషయంలో అటు రాజకీయ వర్గాల్లో... ఇటు అధికార వర్గాల్లో కూడా జోరుగా చర్చ నడుస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం... ముఖ్యమంత్రి కుర్చీపై రేవంత్ రెడ్డి కూర్చున్నారు. ఇక ఏపీ ఎన్నికల్లో కూడా వై నాట్ 175 అని గొప్పలు చెప్పుకున్న వైసీపీ అధినేత జగన్ కూడా కేవలం 11 స్థానాలకే పరిమితయ్యాడు. దీంతో చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రులుగా అధికారంలో ఉన్నప్పుడు మంచి మిత్రులు కూడా. ఒకటికి నాలుగు సార్లు ఇద్దరు కలిసి లంచ్ మీటింగ్ కూడా చేశారు. వీళ్లిద్దరూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించారు కూడా. ఏపీలో 2019లో జగన్ గెలిచేందుకు కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేశారు కూడా. అప్పట్లో చంద్రబాబును ఓడించేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం కూడా లేదు. ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కూడా. ఆ తర్వాత సరిగ్గా తెలంగాణ ఎన్నికల రోజున నాగార్జున సాగర్ రిజర్వాయర్ మీద నానా యాగీ చేశాడు వైఎస్ జగన్. అయినా సరే.. కాంగ్రెస్ గెలుపును ఆపలేకపోయాడు.
ఇప్పుడు వీళ్లిద్దరు ఒకే మాదిరిగా మారిపోయారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్, జగన్ ఇద్దరూ అసెంబ్లీకి వచ్చేందుకు సుముఖంగా లేరు. కాలు విరిగిందని కేసీఆర్ ఆరు నెలల పాటు అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. ఇక జగన్ కూడా ప్రతిపక్ష హోదా లేదంటూ బయట గోల చేస్తున్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు ఒకేలా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి చర్చలు లేని సమయం చూసి వచ్చి వెళ్లిపోతున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం రోజున వచ్చిన జగన్.. తనకు అవమానం జరిగిందంటూ స్పీకర్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే... స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి. అలా చెప్పాలంటే... జగన్కు చాలా కష్టం. ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుపైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. చాలా కేసులు పెట్టారు. చివరికి అత్యాచారయత్నం కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి అయ్యన్నపాత్రుడుని పొగిడెందుకు ముఖం చెల్లక... సభకు దూరంగా ఉన్నారు జగన్. ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగం సమయంలో గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే సభకు వచ్చారు జగన్. తొలిరోజున గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఎవరికీ మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే తొలిరోజు వచ్చిన జగన్... కాసేపు నిరసన అంటూ గోల చేసి.. బయట మీడియా ముందు హంగామా చేసి వెళ్లిపోయారు. సభ జరిగిన 5 రోజులు డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసిన జగన్... ఢిల్లీలో ధర్నా అంటూ హడావుడి చేశారు.
ఇక కేసీఆర్ కూడా సేమ్ టూ సేమ్ ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత దాదాపు 4 నెలలు ఇంటికే పరిమితమయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కోసం కేసీఆర్ ప్రచారం చేశారు. అయితే కనీసం ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకపోవడంతో... మరోసారి ముఖం చాటేశారు. సరిగ్గా ఇదే సమయంలో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కేసీఆర్కు వరుస షాకులు తగిలినట్లైంది. దీంతో పార్టీ ఉనికి కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే నేనున్నా అంటూ ఒక్కసారిగా బయటకు వచ్చారు. అది కూడా సరిగ్గా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే. ఎందుకంటే.. ఆ రోజున అయితే కేవలం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం మాత్రమే ఉంటుంది తప్ప ఇతర సభ్యుల ప్రసంగాలు ఉండవు. కాబట్టి ఆరోజు వచ్చి ముఖం చూపించారు కేసీఆర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు గులాబీ బాస్ సభ వైపు తలెత్తి కూడా చూడలేదు. దీంతో ఈ ఇద్దరు మంచి గేమ్ ప్లాన్ ఆడుతున్నారని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తోంది.